ratan-tata-telugu

Why Should we Invest in Stock Market in Telugu - TeluguBadi

Why Should we Invest?

ధనవంతులు అంత డబ్బుని సంపాదించడానికి ఆ స్థాయికి చేరడానికి గల ముఖ్య కారణం. వాళ్ళు డబ్బుని కూడపెట్టరు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని (Invest)పెట్టుబడిగా పెట్టి రెట్టింపు చేస్తారు. డబ్బుని కూడపెట్టడానికి , రెట్టింపు చెయ్యడానికి చాల తేడా ఉంది. ఎప్పుడైనా సరే డబ్బుని కూడపెట్టడం కాదు , రెట్టింపు చెయ్యడం నేర్చుకోవాలి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం(Inflation) తో మనం పోటీ పడాలన్నా, లేదా భవిష్యత్తులో రాబోయే ఖర్చులను అంటే పిల్లల చదువు , పెళ్లి , ఇల్లు కొనడం , రిటైర్మెంట్ వంటి వాటికి సంపదను ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పటి నుండే మన దగ్గర ఉన్న డబ్బుని పెట్టుబడిగా పెట్టడం చాలా అవసరం. సరే ఇప్పుడు దేనిలో పెట్టుబడిగా పెట్టాలి అనే ప్రశ్న మనందరికీ రావచ్చు. అయితే మనం పెట్టుబడిగా పెట్టడానికి చాలా మార్గాలున్నాయి.

1. బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్ ( Bank Fixed Deposit)

2. రియల్ ఎస్టేట్ (Real Estate)

3. బంగారం, వెండి ( Gold & Silver )

4. షేర్ మార్కెట్ ( Share Market )

ప్రతి పెట్టుబడి మార్గంలోనూ కొంత రిస్క్(Risk) అనేది ఉంటుంది. ఆ రిస్క్ ని బట్టే రాబడి కూడా ఉంటుంది. రిస్క్(Risk) ఎంత ఎక్కువగా ఉంటె రాబడి(Returns)  కూడా ఆ విధంగా ఉంటుంది. సరే ఇప్పుడు రకరకాల పెట్టుబడి మార్గాలు గురించి వాటిలో రిస్క్ మరియు రాబడి గురించి వివరంగా తెలుసుకుందాం.

1. బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్ :

చాలా మంది తమ దగ్గర ఉన్న డబ్బుని బ్యాంకు లో దాచుకుంటారు. ఇలా తమ డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) చెయ్యడం వల్ల బ్యాంకు వాళ్లకు కొంత (Interest)వడ్డీని ఇస్తుంది. సాధారణంగా ఈ వడ్డీ అనేది 7%నుండి 9% వరకు ఉండవచ్చు. అది ఆయా బ్యాంకు ల మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఒక లక్ష రూపాయలు బ్యాంకు లో దాచుకుంటే ఒక సంవత్సరానికి 7000 రూపాయల వరకు వడ్డీ వస్తుంది. అయితే బ్యాంకు లో పెట్టుబడి పెట్టడం వలన మన డబ్బుకి ఎటువంటి రిస్క్ ఉండదు. కాబట్టి రాబడి కూడా తక్కువ.

2. రియల్ ఎస్టేట్

స్థలాలు , ఇళ్ళు వంటి వాటిని కొనడం, అమ్మడం వంటివి ఈ రియల్ ఎస్టేట్ లోకి వస్తాయి. రియల్ ఎస్టేట్ లో రాబడి ఎక్కువగానే ఉంటుంది కానీ దీనిలో పెట్టుబడి పెట్టాలంటే పెద్ద మొత్తం లో డబ్బు అవసరం ఉంటుంది. అలాగే అత్యవసర సమయంలో లేదా ఎప్పుడు కావాలంటే అపుడు ఇల్లు స్థలం వంటి వాటిని అమ్మడం కుదరదు. పైగా లీగల్ పరమైన డాకుమెంట్స్ సంబంధించి , భూ కబ్జాలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి.

3. బంగారం, వెండి

సాధారణంగా మన దేశంలో చాలా మంది తమ దగ్గర డబ్బు ఉంటె బంగారం గాని వెండి గాని కొనుక్కుని దాచుకుంటారు. ఇది కూడా ఒక రకమైన పెట్టుబడి అనే చెప్పాలి. ఎందుకంటే వీటి విలువ రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. వీటి విలువ కూడా సంవత్సరానికి సుమారుగా 8% చొప్పున పెరుగుతూ వస్తుంది. అలాగని ప్రతి సంవత్సరం పెరగాలని లేదు ఒక్కొక్కసారి బంగారం వెండి ధరలు పడిపోవడం కూడా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా బంగారం ఇంట్లో ఉంటె దొంగలతో భయం ఉంటుంది.

4. షేర్ మార్కెట్

షేర్ మార్కెట్లో మనం మన దగ్గర ఉన్న డబ్బుతో ఏదైనా ఒక కంపెనీకి సంబందించిన షేర్ల ను కొంటాం. అంటే ఆ కంపెనీలో మనకు కూడా కొంత వాటా ఉందని అర్ధం. ఇప్పుడు ఆ కంపెనీ కనుక లాభాలు సంపాదిస్తే మనకు కూడా లాభాలు వస్తాయి. ఒకవేళ ఆ కంపనికి కనుక నష్టాలు వస్తే మనకు కూడా నష్టం వస్తుంది. కాబట్టి దీనిలో కొంచెం రిస్క్ ఉన్నపటికీ , మిగిలిన అన్ని పెట్టుబడి మార్గాలతో పోల్చి చుస్తే స్టాక్ మార్కెట్ లో రాబడి ఎక్కువగా ఉంటుంది. అయితే మనం కొంచెం మంచి కంపెనీ లలో పెట్టుబడి పెడితే సుమారుగా సంవత్సరానికి 20% వరకు రాబడి పొందవచ్చు.ఒక్కోసారి రెట్టింపు సంపదనుకుడా పొందవచ్చు కానీ అటువంటి మంచి షేర్లను ఎంచుకోవడానికి ఎంతో శ్రమ , ఓపిక , నైపుణ్యం స్టాక్ మార్కెట్ మీద అవగాహన తప్పనిసరిగా ఉండాలి . అంతేకాదు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు దీర్ఘకాలం పాటు కొనసాగిస్తే వచ్చే రాబడి మరింత ఎక్కువగా ఉంటుంది.

దీనికి మంచి ఉదాహరణ చెప్పుకుందాం.

ఒకవేళ ఎవరైనా 1980 సంవత్సరంలో 10,000 రూపాయలు కనుక (Wipro)విప్రో కంపెనీ లో పెట్టుబడిగా పెట్టి 34 సంవత్సరాల పాటు కొనసాగించి ఉంటె 2014 సంవత్సరంలో వాటి విలువ అక్షరాలా 535 కోట్ల రూపాయలు. నమ్మశక్యంగా లేదు కదా.అదెలాగో ఇప్పుడు చూద్దాం

1980 సంవత్సరంలో విప్రో కంపెనీ షేర్ ధర 100 రూపాయలాగా ఉండేది. ఆ సమయంలో మనం 10000 రూపాయలతో విప్రో కంపెనీకి చెందిన 100 షేర్లు కొన్నాం అనుకుందాం.

1981 లో విప్రో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే మన దగ్గర 1 షేర్ కనుక ఉంటె విప్రో కంపెనీ మరొక షేర్ ని బోనస్ గా మన ఖాతాలో వేస్తుంది. కాబట్టి మనం 100 షేర్లు కొన్నాం కాబట్టి ఇప్పుడు మన దగ్గర 200 విప్రో షేర్లు ఉన్నట్టు.

1985 సంవత్సరంలో కంపెనీ మరలా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. దాంతో మన దగ్గర ఉండే 200షేర్లు కాస్త 400 షేర్లు అయ్యాయి

1986 లో కంపెనీ తన షేర్ ధరను 10 రూపాయలుగా విభజించింది. దీనినే స్టాక్ స్ప్లిట్ (Stock Split) అంటారు. దీని గురించి రాబోయే భాగాలలో వివరంగా తెలుసుకుందాం. ఇలా షేర్ విభజన జరగడంతో మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 400 నుండి 4000 చేరుకుంది.

1987 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. మన దగ్గర ఉండే 4000 షేర్లకి కంపెనీ బోనస్ గా 4000 షేర్లు ఇవ్వడంతో ఇప్పుడు మన దగ్గర షేర్ల సంఖ్య 8000 కి చేరుకుంది.

1989 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. ఇప్పుడు మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 16,000 కు చేరుకుంది.

1992 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది.ఇప్పుడు మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 32,000 కు చేరుకుంది.

1995 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది.ఇప్పుడు మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 64,000 కు చేరుకుంది.

1997 లో కంపెనీ ఈ సారి 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే మన దగ్గర ఉన్న ఒక్కొక్క షేర్ కి రెండు షేర్లను బోనస్ గా ఇస్తుంది. దాంతో మన దగ్గర ఉండే 64,000 షేర్లు 1,92,000 షేర్లు అయ్యాయి.

1999 లో కంపెనీ మరలా తన షేర్ ధరను 2 రూపాయలుగా విభజించింది (Stock Split). ఇలా Stock Split జరగడంతో మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 1,92,000 నుండి 9,60,000 చేరుకుంది.

2004 లో కంపెనీ 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. ఇప్పుడు షేర్ల సంఖ్య 28,80,000 కు చేరుకుంది.

2005 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. ఇప్పుడు మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 57,60,000 కు చేరుకుంది.

2010 లో కంపెనీ 2:3 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే మన దగ్గర 3 షేర్లు ఉంటె కంపెనీ బోనస్ గా 2 షేర్లను ఇస్తుంది. దాంతో మన దగ్గర ఉన్న షేర్ల సంఖ్య 96,00,000.

అంటే మనం 1980 లో 10000 రూపాయలతో కొన్న 100 షేర్లు కాస్త Stock Split, బోనస్ కారణంగా 2010 నాటికి 96,00,000 షేర్లగా మారాయి. ఈ 96 లక్షల షేర్లను 2014 వరకు అమ్మలేదు అనుకుందాం. 7 April, 2014 నాటికి విప్రో కంపెనీ షేర్ ధర 557 రూపాయలుగా ఉంది.

అంటే ఒక్క షేర్ ధర 557 రూపాయలు. మన దగ్గర ఉన్న షేర్ల సంఖ్య 96,00,000. ఇప్పుడు వీటి విలువను లెక్కగడితే

557 × 96,00,000 = Rs.534,72,00,000/- . సుమారుగా 535 కోట్ల రూపాయలు. అంతేకాదు ఈ 535 కోట్ల రూపాయల లాభానికి ఒక్క రూపాయి కూడా టాక్స్(TAX) కట్టవలసిన అవసరం లేదు.

కేవలం Wipro కంపెనీ ఒక్కటే కాదు. Cipla , Reliance, Titan, Dr. Reddy Labs ఇలా ఎన్నో కంపెనీలు ఇటువంటి లాభాలనే అందించాయి.

10000 రూపాయలు ఎక్కడ , 535 కోట్ల రూపాయలు ఎక్కడ. బ్యాంకు , రియల్ ఎస్టేట్, బంగారం ఇలా రంగంలో అయిన ఇంత రాబడి రాదు. అయితే 1980 లో పెట్టుబడి పెట్టి 34 సంవత్సరాల పాటు ఆ పెట్టుబడి ని కొనసాగించిన వారు మాత్రమే అంత లాభం పొందారు. చాలా తక్కువ మందికి మాత్రమే అంతటి ఓపిక ఉంటుంది. చాల మంది ఈరోజు పెట్టుబడి పెట్టి రేపటికి అది రెట్టింపు అయిపోవాలని ఆతృతతో స్టాక్ మార్కెట్ లోకి వచ్చి చేతులు కాల్చుకుంటారు. కాబట్టి Stock Market మీద కొద్దీ పాటి జ్ఞానం, అవగాహన, ఓపికతో పెట్టుబడి పెడితే తప్పకుండ దీర్ఘకాలం లో మంచి లాభాలు పొందవచ్చు.



You May Like:

Online ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Instagram లో ఫేమస్ అవ్వడం ఎలా?

TRP అంటే ఏమిటి?

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చెయ్యాలి?

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

YouTube ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా?

Please Share with Your Friends : )

ads
+